హైదరాబాద్ – బీఆర్ఎస్ లో తీవ్ర దుమారం రేపిన కేసీఆర్ కు రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ లేఖపై తీవ్ర చర్చ జరుగుతోందని, దానిని రాసింది తానేననంటూ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆమె చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ లో కలకలం రేపింది.
ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ తమ నాయకుడని స్పష్టం చేశారు. ఆ లేఖను తాను రెండు నెలల కిందట రాశానని, అది ఎలా బయటకు వచ్చిందో తనకు తెలియదన్నారు. దీనిపై పునరాలోచించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని ఎవరు లీక్ చేశారనే దానిపై ఆలోచించాలన్నారు కవిత. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారనే విషయం దీన్ని బట్టి అర్థం అవుతోందన్నారు. పార్టీ పరంగా అంతర్గతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చంకలు గుద్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఏదో జరిగి పోయిందంటూ ప్రచారం చేస్తున్నాయని, ఆ పార్టీలకు అంత సీన్ లేదన్నారు. వాస్తవాలను బయటకు చెప్పాల్సిన బాధ్యత సీనియర్ నాయకురాలిగా తనపై ఉంటుందని స్పష్టం చేశారు కవిత. కేసీఆర్ నాయకత్వంలోనే పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు.