గుంటూరు జిల్లా – కేంద్రం ప్రవేశ పెట్టిన నక్ష కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతానికి దేశంలోని కొన్ని ప్రాంతాలను నక్ష పేరుతో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం గుంటూరు ఐటీసీ వెల్కమ్ హోటల్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ పై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు.
పట్టణాల్లో భూ వివాదాలు తగ్గించి రెవెన్యూ రికార్డులను పక్కాగా అమలు చేయడం కోసం కేంద్రం నక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్గా 152 మున్సిపాలిటీలను ఎంపిక చేసి భూముల సర్వే చేపట్టింది.
నక్ష పైలట్ ప్రోగ్రామ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 10 మున్సిపాలిటీలు కేంద్రం ఎంపిక చేసింది. ఈ మున్సిపాలిటీలలో 524 చ.కిమీ. విస్తీర్ణంలో 9.5 లక్షల ఆస్తుల సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయ్యి, ఏలూరు, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో కొనసాగుతోంది.
నక్ష పూర్తైన తర్వాత పట్టణాల ప్రణాళిక, పన్నుల విధానం, ఆస్తుల వివాదాల పరిష్కారానికి ఉపయోగపడనుంది. కేంద్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు నారాయణ. వికసిత్ భారత్ 2047 ద్వారా దేశ అభివృద్ధి, స్వర్ణాంధ్ర 2047 ద్వారా రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఈ వర్క్షాప్కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు హాజరయ్యారు.