భారత , పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2025 తిరిగి మే 17 శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు ఆయా జట్లు తీవ్రంగా పోటీ పడనున్నాయి. బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ కీలక మ్యాచ్ కు వేదిక కానుంది. అయితే నిన్నటి నుంచి భారీగా వర్షం కురుస్తోంది. మ్యాచ్ ను రద్దు చేస్తారా లేక తిరిగి నిర్వహిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా ఐపీఎల్ రీ షెడ్యూల్ ను విడుదల చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) . మొత్తం 17 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. మొత్తం ఆరు వేదికలలో లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తారు. లక్నో, ముంబయి, ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ లలో మిగిలిన మ్యాచ్ లు జట్లు ఆడుతాయి. టోర్నీలో భాగంగా మే 29న క్వాలిఫయర్ -1 , 30న ఎలిమినేటర్ , జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుందని ప్రకటించింది బీసీసీఐ.
గతంలో ప్రకటించిన విధంగా ఫైనల్ మ్యాచ్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనుంది. కానీ ఉద్రిక్తతల పరిస్థితులు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా వేదికను మార్చుతున్నట్లు స్పష్టం చేశారు బీసీసీఐ కార్యదర్శి జే షా. ఈ మేరకు కోల్ కతా వేదికను గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంకు మార్చేశామన్నారు.