హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాసిన లేఖ వాస్తవమేనని ఒప్పుకున్నారు. వాస్తవాలను చెప్పేందుకు ఎందుకు భయపడాలని ప్రశ్నించారు. పార్టీ అన్నాక అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాల్సి ఉంటుందన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంతో కూడిన పార్టీ అని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు ఏదో జరిగి పోయిందంటూ ఆనంద పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఏది ఏమైనా ముమ్మాటికీ తమ పార్టీకి , తమకు నాయకుడు కేసీఆరేనని ప్రకటించారు. ఆయన నాయకత్వంలోనే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీ పటిష్టంగా ఉంది. పార్టీలో ఎలాంటి గందర గోళం లేనే లేదన్నారు. అందరూ ఎవరికి వారు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారని చెప్పారు కవిత. తానే లేఖ రాశానని, వ్యక్తిగత ఎజెండా లేనే లేదన్నారు. గత రెండు నెలల కిందట రాసిన ఉత్తరం ఇప్పుడు బయటకు ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ రెండు పార్టీలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు కవిత. ఆ పార్టీల వల్ల తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదన్నారు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష. ఆయన మాకందరికీ దేవుడు. వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ఎజెండాలు లేనే లేవన్నారు. ఉన్నది ఒక్కటే జెండా అదే తెలంగాణ జెండా అని అన్నారు కవిత. గత రెండు మూడు రోజులుగా ఏదో తప్పు జరిగినట్లు లేఖను పదే పదే ప్రస్తావిస్తూ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.