ముంబై – బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ సన్మాన సభ సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆయా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వేలాది మంది అభిమానులు తరలి వస్తారని తెలిసి కూడా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏర్పాట్లు చేయలేక పోయిందంటూ మండిపడింది. దీనికి కారణం భద్రతా వైఫల్యం, ఏర్పాట్లలో లోపాలేనని సంచలన ఆరోపణలు చేసింది. ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది.
లక్ష మంది హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి. చిన్న స్వామి స్టేడియం చాలా చిన్నది. అహ్మదాబాద్ స్టేడియంలోనే లక్ష మంది పట్టగలరు. అలాంటి సమయంలో ముందస్తు ఏర్పాట్లు చేయడంలో ఎందుకు ఫోకస్ పెట్టలేదంటూ ప్రశ్నించింది బీసీసీఐ. గతంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సమయంలో తాము ముంబైలో విజయోత్సవ పరేడ్ చేపట్టామని గుర్తు చేసింది. ఎలాంటి చిన్న పొరపాటు జరగలేదని, ఎక్కడా తొక్కిసలాట చోటు చోసుకోలేదని, ఏ ఒక్కరూ గాయపడలేదని తెలిపింది. దీనికి కారణం సర్కారేనంటూ దుమ్మెత్తి పోసింది. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ విమర్శలను మూటగట్టుకుంది.
ఇదిలా ఉండగా ఆర్సీబీ ప్రోగ్రాంకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సన్మాన కార్యక్రమానికి ఎవరైనా రావచ్చని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. 5 వేల మందికి పైగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా లక్ష మందికి పైగా హాజరు కావడంతో చేతులెత్తేశారు. దీంతో స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఒకరిపై మరొకరు పడి పోయారు. భారీగా తోపులాట చోటు చేసుకుంది. చాలా మంది ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రారంభంలో పాస్ లు జారీ చేస్తామని చెప్పారు. కొందరికే దక్కాయి. ఆ తర్వాత అందరికీ ఫ్రీ అంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా దూసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.