బెంగళూరు – కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 33 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని తాము ఊహించ లేదన్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేలు ఉంటే 3 లక్షల మంది వచ్చారని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు.
గాయపడిన వారిని ఆస్పత్రులలో చేర్పించామన్నారు. ముందుగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు సీఎం సిద్దరామయ్య. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 వేల మందికి పైగా పోలీసులు భద్రతలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేవని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని ఆరోపించారు. కేవలం 11 మంది చని పోతే రాద్దాంతం చేస్తారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో ఆయన యూపీలో కేంద్ర సర్కార్ నిర్వహించిన కుంభ మేళాను ప్రస్తావించారు. తొక్కిసలాటలో 50 మందికి పైగా భక్తులు చనిపోయారని, మరి ఎందుకు కేంద్రం స్పందించ లేదంటూ నిలదీశారు సీఎం సిద్దరామయ్య. ఇదంతా కావాలని తమ సర్కార్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.