బెంగళూరు – ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్బంగా చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మందికి పైగా చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టాటా ఐపీఎల్ 2025 కప్ ను కైవసం చేసుకుంది.
ఈ సందర్బంగా భారీ ఎత్తున సాదర స్వాగతం పలికేందుకే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ , రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో లక్షలాది మంది అభిమానులు తమ జట్టు సభ్యులను చూసేందుకు తరలి వచ్చారు. దీంతో బెంగళూరు నగరం ఇసుక వేస్తే రాలనంతగా నిండి పోయింది. 5 వేల మందికి పైగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా కంట్రోల్ చేయలేక పోయారు. సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలం అయ్యారు.
దీనిపై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయ్యింది. మొత్తం ఘటనపై వెంటనే పూర్తి నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీసు పంపించింది. ఈ సందర్బంగా సర్కార్ సీరియస్ అయ్యింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ సీపీ దయానంద్తో పాటు ఏసీపీ, డీసీపీ పై వేటు వేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఏ1గా ఆర్సీబీ, ఏ2గా ఈవెంట్ మేనేజ్మెంట్, ఏ3గా KSCA నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీని ఆదేశించింది.