మరణం లేని మహానుభావుడు దివంగత నందమూరి తారక రామారావు అని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్. ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ , ఆస్ట్రేలియాలోని ఎన్నారై తెలుగుదేశం, స్థానిక తెలుగు సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో అడిలాయిడ్ లో ఎన్టీఆర్ 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవం, సిబిఎన్ 75 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ టి.డి. జనార్థన్, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్, నన్నూరి నర్సిరెడ్డి, అట్లూరి అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి యతి ప్రసాలతో చమక్కులతో తనదైన శైలిలో ప్రసంగించారు. ఆహుతుల్ని సమ్మోహితుల్ని చేశారు. అన్న ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవిత విశేషాల్ని ప్రస్తావించారు. నారాచంద్రబాబు నాయుడు దూరదృష్టితో హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం వల్లనే కోవిడ్ కు వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగామని, తద్వారా కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని తెలియజెప్పే పలు ఉదాహరణల్ని చెప్పారు నందమూరి రామకృష్ణ. ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఓ శక్తి అని పేర్కొన్నారు. ఆయన కుమారుడిగా పుట్టడం తన అదృష్టం అన్నారు.
ఎన్టీఆర్ ది మరణం లేని జననం అని… కోట్లాది మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు టీడీ జనార్దన్. ఇక నుంచి ఎవరూ ‘ఎన్టీఆర్ జోహార్’ అనవద్దని, ‘ఎన్టీఆర్ జై’ అని మాత్రమే అందాం అని అన్నారు. ఎందుకంటే సినీ, రాజకీయ రంగాలలో తన ధర్మం నిర్వర్తించి తనువు చాలించారని, అవసరమైనప్పుడు ఎన్టీఆర్ కొత్త అవతారంలో వస్తారంటూ అజరామరమైన ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్ఠలను తెలియజేశారు.
మహానుభావుడైన ఎన్టీఆర్ చరిత్రను అందరూ తెలుసుకోవాలని టి.డి. జనార్థన్ పేర్కొన్నారు. ‘మనదేశం’ అనే సినిమాతో సినీరంగం ప్రవేశం చేసిన ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం విశేషమన్నారు. ఎన్టీఆర్ ఏ పని చేసినా ప్రజల కోసమే చేశారన్నారు. ఆయన నటించిన పాత్రలన్నీ ఉదాత్తమైనవనీ, సందేశాత్మకమైనవనీ, సమాజాన్ని సరియైన మార్గంలో నడిపించే చిత్రాల్లోనే నటించారని గుర్తుచేశారు.
చరిత్రలో ఏ సినిమా నటుడుకూడా ప్రపంచంలోనే ఎన్టీఆర్ మాదిరిగా అన్ని వైవిధ్యమైన పాత్రలు ధరించడం, సినిమా నిర్మాణ దర్శక బాధ్యతల్ని ఏకకాలంలో చేయడం జరగలేదని అన్నారు. అదీ ఎన్టీఆర్ ఘనత అన్నారు. చరిత్రను చెప్పాలి… చెబుతూనే ఉండాలి… అని జనార్దన్ స్పష్టం చేశారు.
రాజకీయ రంగంలో అన్న ఎన్టీఆర్ నెలకొల్పిన ప్రమాణాలు అనితరసాధ్యం అన్నారు. అధికారంలోకి రాగానే పేదవాడి సంక్షేమమే తొలి ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. ఆనాడే పేదవారికి ఆహార భద్రత కల్పించారన్నారు. ఇప్పుడు అందరూ… అన్ని దేశాలవారు ఆహారభద్రత గురించి మాట్లాడుతున్నారన్నారు.
ఆహార భద్రతతోపాటు పేదవారికి పక్కా గృహాలు, జనతా వస్త్రాలు అందించారని, వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ. 30 ల చొప్పున సామాజిక పెన్షన్లు అందించారని, ఇప్పటి విలువతో లెక్కిస్తే వాటి విలువ నెలకు రూ. 6,600 అవుతుందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నేడు నెలకు రూ. 4 వేలు పెన్షన్లు పేదవారికి అందిస్తున్నారని అన్నారు.
రాజకీయాలలో యువతను తొలుత ప్రోత్సహించిన వారు అన్న ఎన్టీఆరేనని, 30 ఏళ్లక్రితం యువకుడినైన తనకు కృష్ణాజిల్లా సహకార బ్యాంకు అధ్యక్షపదవిని ఇచ్చి పోత్సహించారని, ఎంతోమంది హేమా హేమీలు ఆ పదవి కోసం పోటీపడినా… వారందరినీ కాదని తనకు పదవి ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. చంద్రబాబు పట్ల అభిమానంతోనే తాను ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసి వారిద్దరికీ సంబంధించిన కార్యక్రమాల్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ముఖ్యనగరాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.