చిత్తూరు జిల్లా – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రూ. 80 వేల రూపాయలు తీసుకున్న అప్పును చెల్లించక పోవడంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు వైరల్ గా మారాయి. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఈ ఘటనపై బాబు సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కుప్పంలోని నారాయణపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించక పోవడంతో డబ్బులు ఇచ్చిన వాళ్లు చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. వివరాలలోకి వెళితే తిమ్మ రాయప్ప అనే వ్యక్తి రెండు సంవత్సరాల కింద స్థానిక టీడీపీ కార్యకర్త ముని కన్నప్ప నుండి ఎనభై వేలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించ లేక , ఊరి నుండి పారి పోయాడు. కాగా తన భార్య శిరీష, ఇద్దరు చిన్న పిల్లలను విడిచి వెళ్లాడు.
అప్పు చెల్లించేందుకు గాను శిరీష రోజు వారీ కూలీగా పని చేయడం ప్రారంభించింది. ఆమె వడ్డీ కట్టడం, అసలు తీర్చడం ఇబ్బందిగా మారింది. దీంతో ముని కన్నప్ప, కుటుంబీకులు శిరీషపై దాడికి పాల్పడ్డారు. నష్ట పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. వేప చెట్టుకు కట్టేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శిరీషను విడిపించారు. ముని కన్నప్పను అరెస్ట్ చేశారు.
బీఎన్ఎస్ సెక్షన్లు 341 (తప్పుడు నిర్బంధం), 323 (స్వచ్ఛందంగా గాయ పరచడం), 324 (ప్రమాదకరమైన ఆయుధంతో దాడి), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో అనేక మంది వ్యక్తులు చేసిన చర్యలు) కింద కేసు నమోదు చేశారు.