అమరావతి – ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డీఎస్సీ 2025 కి సంబంధించి సూచనలు చేసింది.. ఈ సందర్బంగా ఈ పరీక్షకు సంబంధించి కీలకమైన రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు జూన్ 24 వరకు ఛాన్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది ఏపీ పాఠశాల విద్యా శాఖ. ఇదిలా ఉండగా ఇటీవలే మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 వేల 437 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ నిర్వహించింది. వివిధ బోధనా పోస్టులకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది విద్యా శాఖ.
ఇందులో టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ – గణితం, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులతో పాటు భాషేతర పోస్టులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు తమ ప్రతిస్పందన పత్రాలను అధికారిక AP DSC పోర్టల్ – apdsc.apcfss.in – నుండి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జాగ్రత్తగా పరిశీలించి తమకు అభ్యంతరాలు ఉన్నట్లయితే నమోదు చేయాలని పేర్కొంది.
ఇదిలా ఉండగా ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు చేపట్టనుంది ప్రభుత్వం. జూన్ 20, 21వ తేదీలో జరిగిన డీఎస్సీ పరీక్షలను వచ్చే నెల జూలై 1, 2 తేదీలకు వాయిదా వేసినట్లు తెలిపింది ఏపీ విద్యా శాఖ. కాగా కొత్త పరీక్ష తేదీలు, కేంద్రాలతో నవీకరించబడిన హాల్ టిక్కెట్లు జూన్ 25 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
కాగా సోమవారం నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ – సోషల్ స్టడీస్ కోసం జరిగిన DSC పరీక్షలో 95.11% హాజరును నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని 227 కేంద్రాలలో 38,243 మంది నమోదైన అభ్యర్థులలో 36,372 మంది హాజరయ్యారు.