హైదరాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య రహస్య మీటింగ్ జరగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి భేటీలో ఏం చర్చించారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఎందుకు నోరు మెదపడం లేదంటూ మండిపడ్డారు రేవంత్ పై. ఈ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కవిత.
గోదావరి-బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టును నిరోధించడంలో, బిసి బిల్లుకు ఆమోదం కోరడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులపై బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు వైఖరిని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య సరైన నీటి నిర్వహణ కోసం కెసిఆర్ వాదించారని తెలిపారు.
తుపాకులగూడెం వద్ద అనుసంధాన స్థానం ఉంటే, వరంగల్, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం , రంగారెడ్డి వంటి ప్రాంతాలకు గోదావరి నది నుండి నీరు లభిస్తుందని కవిత స్పష్టం చేశారు. నదుల అనుసంధాన ప్రాజెక్టును గోదావరి-కృష్ణాకు బదులుగా గోదావరి-పెన్నా-కావేరిగా వ్యూహాత్మకంగా పేరు మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును కవిత విమర్శించారు.
రేవంత్ రెడ్డిని ఆమె ఫ్లైట్ మోడ్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు .