విశాఖపట్నం – మాజీ సీఎం జగన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఎవరైనా నేరస్తులను అడ్డుకుంటారని, కానీ నేరాలు, ఘోరాలను ప్రోత్సహించేలా జగన్ వ్యవహార శైలి ఉందంటూ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రిమినల్స్, సమాజానికి అన్యాయం చేసిన వాళ్లను పరామర్శించడానికి వెళ్లడం దారుణమన్నారు. సైకో అనే పేరుకు తగ్గట్టుగానే తన పార్టీని తీవ్రవాద సంస్థగా మారుస్తున్నారంటూ ఆరోపించారు. తన పార్టీ నేతల రౌడీయిజం కారణంగా చనిపోయిన వారిని ఒక్కరినీ ఇప్పటి వరకు పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
సంఘ విద్రోహశక్తులుగా ఉన్న తెనాలిలోని గంజాయి బ్యాచ్ ని, ఈరోజు నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు మంత్రి అనగాని సత్య ప్రసాద్. కూటమి ప్రభుత్వం రాకముందు నాగమల్లేశ్వరరావు చనిపోతే ఏడాది తర్వాత ఇప్పుడు పరామర్శించడానికి వెళ్లడం శవ రాజకీయం చేయడం తప్ప మరోటి కాదన్నారు. తన పార్టీకే చెందిన సింగయ్య (53) చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లక పోవడం తన క్యారెక్టర్ ఏమిటో చెబుతుందన్నారు.
కానీ ఐదేళ్లపాటు ఊళ్లో ప్రజలను కాల్చుకు తిని, బెట్టింగులు పెట్టి ప్రాణాలు తీసుకున్న నాగమల్లేశ్వరరావు ఇంటికి వెళ్లడం పట్ల మండిపడ్డారు మంత్రి. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా చంద్రబాబును, మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వ లేదన్నారు. కానీ తాము జగన్ టూర్ కు ఛాన్స్ ఇచ్చామన్నారు. ఎలక తోలు మాదిరి జగన్ బుద్ధి ఎంతకీ మారడం లేదన్నారు. తన హెలికాప్టర్ పైన తానే రాయి వేసుకొని జగన్ రెడ్డి పెద్ద డ్రామా నడిపాడని ఆరోపించారు.