హైదరాబాద్ – తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ప్రజల ఇబ్బందులను తొలగించాల్సింది పోయి చంద్రబాబుకు , ఆయన కంపెనీకి మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బనకచెర్ల ద్వారా ఆంధ్రాకు సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాలకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించిన తర్వాతనే ఈ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో స్పందించిందన్నారు.
అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడడంతో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమావేశం నుండి బయటకు వచ్చారని చెప్పారు. నిరంజన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తమ ఎంపీని సీఎం కించ పరిచేలా మాట్లాడారంటూ వాపోయారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తన స్థాయి ఏమిటో తెలుసుకోకుండా కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఈ విషయంలో ఏదో పాండిత్యం ఉన్నట్లు మాట్లాడారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి ఏదో సాధించినట్లు పొగడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కేంద్ర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒప్పందంగా చిత్రీకరించడం సీఎం రేవంత్ రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు. సమావేశంలో ఎవరు ఏం మాట్లాడినా రికార్డ్ చేస్తారన్న విషయం తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. మొత్తం సమావేశంలో బనకచర్లను ఖచ్చితంగా అడ్డుకుని తీరతాం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదంటూ నిలదీశారు నిరంజన్ రెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.32,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ కేవలం 172 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు.