అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ప్రభాస్, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి దర్శకుడు మారుతి కర్త, కర్మ అన్నీ. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇంకా ఒక్క పాట, కొన్ని ముఖ్యమైన సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పాడు దర్శకుడు. ఈ సందర్బంగా తన టీజర్ కు మంచి బజ్ రావడంపై స్పందించాడు. తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఒక రకంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు మారుతి.
ఒకనాడు తన తండ్రి అరటిపళ్లు అమ్మిన బండి వద్దనే తాను తీసిన రాజా సాబ్ కటౌట్ ఉండడాన్ని మరిచి పోలేనని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ తామేమిటో నిరూపించుకునే ఛాన్స్ ఒక్కసారే వస్తుందని, ఆ లక్ తనకు ప్రభాస్ రూపంలో దొరికిందన్నాడు మారుతి. రాజా సాబ్ ను హారర్, కామెడీ, రొమాంటిక్ గా తీశానని చెప్పాడు. పాన్ ఇండియా హీరోతో సినిమా చేయడం మామూలు విషయం కాదన్నాడు. ఇక దర్శకుడి గురించి చెప్పాలంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాడు. కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముకున్నాడు. అందుకే తనకు డార్లింగ్ ఛాన్స్ ఇచ్చాడు.
తొలుత ఈ రోజుల్లో అనే మూవీతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయవంతమైన చిత్రాలు తీశాడు. భారీ బడ్జెట్ కు తను దూరం. కేవలం అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయడం, వాటిని సక్సెస్ పట్టాలు ఎక్కించడం తన హాబీ. ఇప్పటి దాకా చిన్న చిత్రాలు తీసిన తనకు రాజా సాబ్ లాంటి పెద్ద సినిమా తీయడం ఓ ఛాలెంజ్ . దీంతో అన్నింటిని పక్కన పెట్టి ఈ మూవీపైనే ఫోకస్ పెట్టాడు మారుతి.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశాడు దర్ఖుడు. మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ లో మా నాన్న చిన్న షాప్ పెట్టుకుని పళ్లు అమ్మే వాడు. అక్కడ విడుదలైన అందరి హీరోల బ్యానర్లు తాను తయారు చేసే వాడినని తెలిపాడు. ఒక్కసారైనా నా పేరు అక్కడ చూసుకోవాలని ఉండేదన్నాడు. కానీ రాజా సాబ్ తో ఆ కల తీరిందన్నాడు. ప్రభాస్ తో పాటు తన ఫోటోతో బ్యానర్ ఉండడం కన్నీళ్లు పెట్టించేలా చేసిందన్నాడు. దీనిని చూసేందుకు మా నాన్న ఇప్పుడు లేడంటూ కంట తడి పెట్టాడు.