అమరావతి – నల్ల బర్లీ పొగాకు చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి కింజారపు అచ్చంనాయుడు స్పష్టం చేశారు. పొగాకు రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. హెచ్ డి ఆర్, హెచ్ డి ఎం రకం బ్లాక్ బర్లీ పొగాకు ఒక క్వింటా ధర రూ. 12 వేలు, హెచ్ డి ఎక్స్ రకం పొగాకు ఒక క్వింటా రూ.ఆరు వేలు ధరతో మార్క్ ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు.
నల్ల బర్లీ పొగాకును ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా కొనుగోలు చేస్తుందని అచ్చంనాయుడు తెలిపారు. రైతులు రాజుగా ఉండాలి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించేలా అన్ని వనరులను సమకూరుస్తోందన్నారు. రైతుల కష్టాలన్నీ తీరుస్తున్నాం, రహదారులు, నీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. 90 శాతం రాయితీపై స్ప్రింక్లర్లు, బిందు సేద్యానికి సంబంధించిన యంత్రాలను పంపిణీ చేశామన్నారు. గతంలో మిగిలి పోయిన ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1,650 కోట్లను చెల్లించామన్నారు. గడిచిన ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ఘనత ఉందన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్చి, మామిడి, కోకో, బ్లాక్ బర్లీ పొగాకు పంటలకు తీవ్ర సమస్య వచ్చిందన్నారు. మిర్చి ధర తగ్గకుండా ముఖ్యమంత్రి ప్రణాళిక బద్ధంగా మద్దతు ధరతో కొనుగోలు చేశారన్నారు. మామిడి పంటకు మద్దతు ధరను ప్రభుత్వం కల్పించిందన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన కంపెనీలు ఇప్పుడు దిగుబడి రాగానే చేతులెత్తేశాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు.
చరిత్రలో ఎక్కడా, ఎప్పుడు లేనట్లుగా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభించిందన్నారు. కొనుగోలు చేసిన పొగాకును విదేశాలకు ఎగుమతి చేయాలంటే నాణ్యతను, మార్క్ ఫెడ్ నిబంధనలను రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పొగాకు రైతులకు సుమారుగా రూ.500 కోట్లు నగదు రానున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్చూరు, చీరాల, బికే పాలెం , గుంటూరు ,ఎడ్లపాడు, గుడ్లవల్లి, పెదకాకాని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.
పొగాకు రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి అచ్చంనాయుడు స్పష్టం చేశారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులకు రైతులు గురికాకుండా ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, భూమి, వాతావరణ సమతుల్యతను బట్టి ఎలాంటి పంటలు సాగు చేయాలో ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, అధికారుల సూచన మేరకు రైతులు పంటల సాగు చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నారు.