హైదరాబాద్ – యోగా అన్నది యోగం అని, అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారథ్యంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి రోజూ ఎన్నో ఇబ్బందులు, మరెన్నో ఒత్తిళ్లు ఉంటాయని వాటిని తట్టుకుని నిలబడే శక్తి, సామర్థ్యం కేవలం యోగా వల్లనే కలుగుతుందని స్పష్టం చేశారు. యోగా అంటేనే ప్రపంచంలో భారత దేశం గుర్తుకు వస్తుందన్నారు. పాశ్చత్య దేశాల ప్రజలు సైతం ఇప్పుడు యోగాను అనుసరిస్తున్నారని, దాని వల్ల ఉపయోగాలను గుర్తించారని చెప్పారు వెంకయ్య నాయుడు. ఇవాళ యోగా కార్యక్రమంలో పాల్గొనడం తనకు మరింత ఆనందం కలిగించేలా చేసిందన్నారు.
యోగ దినోత్సవ సంకల్పం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం పరిపూర్ణ ఆరోగ్యం , శాంతితో ముందుకు సాగడం అని పేర్కొన్నారు ఉప రాష్ట్రపతి. ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే నినాదంతో జరుపు కోవడం అద్భుతమని ప్రశంసించారు. మన ప్రధాని మోదీ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. మనమందరం ఒకే దృఢ సంకల్పం తీసుకొని వసుధైవ కుటుంబం అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.