విశాఖపట్నం – విశాఖ నగరం సర్వాంగ సుందరంగా మారి పోయింది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా 11వ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ హాజరవుతున్నారు. ఆయన శుక్రవారం రాత్రికే నగరానికి చేరుకుంటారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 వేల మంది పోలీసులు , 30కి పైగా డ్రోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ బాగ్చి.
యోగా డే సందర్బంగా ఏకంగా విశాఖ బీచ్ నుంచి నగరానికి 5 లక్షల మందితో యోగా డే ర్యాలీ చేపట్టనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రేపు జరిగే కార్యక్రమంపై యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోందని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని ఇది రాష్ట్ర చరిత్రలో ఓ రికార్డ్ అని పేర్కొన్నారు. ఇది గిన్నిస్ బుక్ రికార్డులో చోటు దక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం.
ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. యోగా డేలో పీఎం మోదీ పాల్గొంటారని, ఆయనతో పాటు తాను కూడా యోగాసనాలు చేస్తానని ప్రకటించారు. ప్రధాని రావడం మనందరికీ, ప్రత్యేకించి విశాఖ నగరానికి ఓ గౌరవం అని పేర్కొన్నారు. కూటమి సమర్థవంతమైన పాలనకు ఈ కార్యక్రమం నిదర్శనం కాబోతోందన్నారు నారా చంద్రబాబు నాయుడు.