విశాఖపట్నం – యోగా మనందరి జీవితాల్లో భాగం కావాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. విశాపట్నంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 5 లక్షల మందితో నగరంలో ఆర్కే బీచ్ నుంచి యోగా ర్యాలీ చేపట్టారు. ఎక్కడ చూసినా యోగాతో నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఎం నరేంద్ర మోదీ హాజరయ్యారు. లక్షలాది మంది తరలి వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
యోగా కార్యక్రమంతో యావత్ ప్రపంచం మొత్తం విశాఖ నగరం వైపు చూసేలా చేశామన్నారు ఈ సందర్బంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తమకు టైం ఇచ్చి, పాల్గొన్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటోందన్నారు. 177 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని చెప్పారు. 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్ సృష్టించారని అన్నారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ -అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని అన్నారు. యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఇవాళ మనం ప్రవేశ పెట్టిన యోగాను 175 దేశాలు అనుసరిస్తున్నాయని, ఇదంతా భారత్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. మొత్తంగా యోగా యావత్ ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి రోజూ క్రమం తప్పకుండా యోగాను సాధన చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర దామోదర దాస్ మోదీజీ