ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ప్రపంచ పారా అథ్లెటిక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ పారా ఒలంపిక్స్ కు వేదిక కానుంది దేశ రాజధాని ఢిల్లీ. ఈ ఏడాదే జరగనున్నాయి. తనను ఎంపిక చేసినట్లు కీలక ప్రకటన చేసింది పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) . ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ క్రీడలు వచ్చే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరుగుతాయి. భారత ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
తనను పారా ఒలింపిక్స్ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల స్పందించారు నటి కంగనా రనౌత్. ఈ అవకాశం లభించడం తనకు ఆనందాన్ని, అంతకు మించిన గౌరవాన్ని కలిగించిందన్నారు. పారా అథ్లెట్స్ సాధించిన గెలుపులు, రికార్డుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తాను శాయ శక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పారు కంగనా రనౌత్.
పారా స్పోర్ట్స్ అనేవి కేవలం పోటీ మాత్రమే కాదని ధైర్యానికి, సంకల్పానికి, చిత్త శుద్దికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తనను ప్రత్యేకంగా ఎంపిక చేసినందుకు పారా ఒలింపిక్స్ నిర్వహణ కమిటీకి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడా శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు నటి, ఎంపీ.