తమిళనాడు – సనాతన ధర్మం ప్రధాన లక్ష్యం పరమత సహనం అని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొని ప్రసంగించారు. ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం అన్నారు. ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడని మండిపడ్డారు. వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై, అమ్మ వారిపై కూడా రేపు ప్రశ్నలు వేస్తారని ఆరోపించారు. వారిది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని హెచ్చరించారు.
తాను పదహారు ఏటే శబరిమల వెళ్లానని, థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశానని చెప్పారు. విభూతి పెట్టుకొని స్కూల్కి వెళ్లానని గుర్తు చేశారు. ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం అని నిలదీశారు పవన్ కళ్యాణ్. హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు… సూడో సెక్యులరిజం అంటూ మండిపడ్డారు.
తాను 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించానని చెప్పారు. నేను తమిళనాడు లో పెరిగాను, తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, గౌరవాన్ని పెంచుకున్నవాడిని, ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం.
మురుగన్ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా చేస్తుంది. మన జీవితాన్ని మధురంగా మార్చుతుందన్నారు. ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయన్నారు. అలాగే మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారని అన్నారు. కాబట్టి కచ్చితంగా మార్పు అన్నది వచ్చి తీరుతుందన్నారు.