అమరావతి – ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. ఇందులో భాగంగా జూన్ 26న ఉదయం 10 గం.లకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రపురం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హాజరవుతున్నారని తెలిపారు.
దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్.ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక హేవలాక్ వంతెనకు కొత్త సొబగులు, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు మంత్రి. కడియం నర్సరీలు ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా అభివృద్ధి చేస్తామన్నారు. నిడదవోలు సమీపంలోని కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ, గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ జరుగుతుందన్నారు. బ్రిడ్జిలంకలో బోటింగ్, టెంట్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
గోదావరి కాలువలో బోటింగ్, గోదావరికి నిత్య హారతి ఉండేలా చూస్తామన్నారు కందుల దుర్గేష్. అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందన్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా 8 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు:మంత్రి కందుల దుర్గేష్