ఏపీలోని క్యాన్సర్ బాధితులకు తీపి కబురు చెప్పారు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. త్వరలో రాష్ట్ర రాజధాని అమరావతిలో 300 పడకలతో ప్రత్యేకంగా క్యాన్సర్ బాధితులకు అండగా ఉండేందుకు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన తల్లి బసవ తారకం స్మృతిలో దీనికి శ్రీకారం చుట్టామన్నారు. హైదరాబాద్ లో రజతోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తాను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించింది స్వార్థ లాభాల కోసం లేదా ఇతర ప్రయోజనాల కోసం కాదని మరోసారి స్పష్టం చేశారు నందమూరి బాలకృష్ణ. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న వారికి సరసమైన మందులు అందించడం కోసమేనని పేర్కొన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన తల్లిని కోల్పోవడం వల్లే ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. తొలుత కేవలం110 పడకల చిన్న ఆసుపత్రిగా ప్రారంభించాంమని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత దాతలు, ప్రభుత్వాల సహాయ సహకారాలతో అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక వైద్య పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిగా మారిందని అన్నారు నందమూరి బాలయ్య. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ సర్కార్ అందించిన మద్దతుకు తాను ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు కూడా థ్యాంక్స్ తెలిపారు. తనను అభినందించిన గవర్నర్ ను మరిచి పోలేనని పేర్కొన్నారు.