హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఇద్దరూ రామచిలుకల్లా మాట్లాడుతన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇంతకూ బండి ఏ పార్టీనో చెప్పాలన్నారు. ఆయన పదే పదే సీఎంకు వత్తాసు పలకడం దారుణమన్నారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు భంగం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నా ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఫైర్ అయ్యారు.
ఎంపీ ఈటెల రాజేందర్తో అధ్యక్ష పదవిపై ఉన్న పేచీతోనే బండి సంజయ్ కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఆరోపించారు దాసోజు శ్రవణ్. బీజేపీ నేతలందరూ ఒక చోట సంకల్ప సభ పెట్టుకుంటే బండి సంజయ్ ఆ మీటింగ్కు పోకుండా తన ఎజెండాను తెరపైకి తెచ్చారని అన్నారు. రేవంత్ రిమోట్ ఎత్తితే ఎగిరే తోలు బొమ్మ బండి అంటూ భగ్గుమన్నారు. గోదావరి నీళ్లు తాగిన బండి సంజయ్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కానే కాదంటూ స్పష్టం చేశారు.
సీబీఐ విచారణ జరిగితే ఈటెల రాజేందర్ను కూడా పిలవాల్సి ఉంటుందన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్. పిలిస్తే రాజేందర్కు బీజేపీ అధ్యక్ష పదవి రాదని బండి సంజయ్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఆయనకు తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ లేదని, ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కాళేశ్వరంపై చంద్రబాబు కన్నా హీనంగా మాట్లాడిన బండి సంజయ్ను తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు.