అమరావతి – వైసీపీ బాస్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదెల. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలారని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల కుప్పగా మార్చేసి తమపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి మాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని పేర్కొన్నారు.
తలలు నరికేస్తాం గొంతులు కోస్తాం అనే డైలాగ్స్ సినిమాల్లోనే బాగుంటాయన్నారు. నిజ జీవితంలో వర్కవుట్ కాదన్నారు. అధికారం కోల్పోయినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదన్నారు. అప్పుడు ఎలాంటి అరాచకాలు చేశారో ఇప్పుడూ అలానే చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగితే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. చట్ట బద్దంగా తాము వ్యవహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం సీఎం చంద్రబాబు చేస్తున్నారంటూ స్పష్టం చేశారు.
దివ్యాంగులకు పింఛన్లు, సామాజిక పింఛన్లు పెంచి ఆర్థిక భరోసా కల్పించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశామన్నారు. ఏడాది కాలంలో రూ. 9.4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్. యోగాంధ్ర, గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్నారు. మరో 20 ఏళ్లపాటు వైసీపీ అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు. తమది మెతక సర్కార్ అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు ఆటంకం కలిగిస్తూ వస్తే చూస్తూ ఊరుకోమన్నారు డిప్యూటీ సీఎం. కూటమి సర్కార్ గనుక రాక పోయి ఉంటే ఏపీ ఎలా ఉండేదోనన్న భయం కలిగిందన్నారు.