హైదరాబాద్ – కొలువు తీరిన కొత్త సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది తెల్ల రేషన్ కార్డుదారులకు. ఇప్పుడు అమలు చేసే ప్రతీ పథకంలో లబ్ది పొందాలంటే తప్పనిసరిగా కార్డు కలిగి ఉండాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్డులు పొందిన వారిని జల్లెడ పట్టింది. ఈ మేరకు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 77 వేల రేషన్ కార్డుదారులు సరైన అర్హత లేని వారై ఉన్నారని గుర్తించింది.
దీంతో ఈ కార్డులన్నింటినీ రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది. మరో వైపు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. వీటిని అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే అడ్డగోలుగా హామీలు ఇచ్చుకుంటూ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన హామీలు అమలు కావాలంటే దేశంలోని మొత్తం బడ్జెట్ సరి పోదంటూ పేర్కొంటున్నారు రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు.
గుర్తించిన కార్డులందరూ రేషన్ పొందేందుకు అనర్హులంటూ పేర్కొంది సర్కార్. కేంద్ర సర్కార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది రాష్ట్ర పౌరసఫరాల శాఖ. అనుమానాస్పదంగా ఉన్న రేషన్ కార్డుదారులపై కన్నేసి ఉంచింది. దాదాపు వీరి పరిశీలనలో ఏకంగా 76, 842 మంది పేర్లు కార్డుల నుంచి తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఎవరు అసలు ఎవరు నకిలీ అనేది గుర్తించారు ఆ మధ్యన. చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం, స్థానికంగా ఉండక పోవడం, మరికొందరు చని పోవడం, ఇంకొందరు తప్పుడు సమాచారం ఇవ్వడం, తదితర కారణాలను గుర్తించింది. విచిత్రం ఏమిటంటే అనర్హుల లిస్టులో ఎక్కువగా మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.