అమరావతి – ఏపీలో పెద్ద ఎత్తున టీచర్ల బదిలీ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 67,732 మంది టీచర్లు బదిలీ కాగా 4, 477 మంది పంతుళ్లు పదోన్నతులు పొందారు. రాష్ట్ర విద్యా శాఖ భారీ ఎత్తున కసరత్తు పూర్తి చేసింది. పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి విజయరామ రాజు నేతృత్వంలోని ఈ విభాగం మొత్తం 72, 209 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం టీచర్లపై బదిలీ వేటు పడగా మరికొందరికి ప్రమోషన్స్ ఛాన్స్ దక్కింది.
దీనిపై ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపినా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పట్టించు కోలేదు. పూర్తి పారదర్శకతతో బదిలీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే ట్రాన్సఫర్స్ ను పెద్ద ఎత్తున చేయడంతో కిమ్మనకుండా ఉండి పోయారు టీచర్లు.
బదిలీలకు సంబంధించి సమగ్ర ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా చేసుకుని నిర్వహించింది. అనుభవం, పనిచేస్తున్న చోటు, విద్యార్హతలు, పని చేస్తున్న ప్రాంతాలలో ఎన్నేళ్లు ఉన్నారనే దానిపై కూడా చూసింది. అంతే కాకుండా వయసు రీత్యా ఎక్కువ వయసు కలిగిన వారికి వారు కోరుకున్న ప్రాంతాలలో పని చేసేలా ఛాన్స్ కలిపించడం అభినందనీయం.
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ , మున్సిపల్ పాఠశాలలు వంటి వివిధ పాఠశాలల సిబ్బందిని కవర్ చేసింది. పారదర్శకత, మెరిట్ పరిశీలన, విధానపరమైన న్యాయబద్ధతను అన్నింటికంటే మించి ఉంచుతూ, మొత్తం ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించినట్లు విద్యా శాఖ స్పష్టం చేసింది.