హైదరాబాద్ – గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ముగ్గురు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తొలి దశలో నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలన్నారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచు కోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని అభిప్రాయపడ్డారు సీఎం.
అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని సూచనలు చేశారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని ఆదేశించారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని స్పష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి. గోశాలల అభివృద్ధి, నిర్వహణ విధానంపై అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు.
పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ సబ్యసాచి గోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.