గుజరాత్ – ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే కూలి పోయింది. ఇందులో 242 మంది ప్రయాణిస్తున్నారు. వారి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న వారిలో మాజీ సీఎం విజయ్ రూపాణి ఉన్నారు. ఆయన దుర్మరణం చెందినట్లు కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణీకులతో పాటు సిబ్బంది జాడ ప్రశ్నార్థకంగా మారింది.
ఏఐ 171 అనే నెంబర్ కలిగిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనే కుప్ప కూలింది. ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతోంది. గురువారం మధ్యాహ్నం 2.42 గంటలకు ఈ ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోపే మేఘానీ నగర్ లో కూలి పోయింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎయిర్ ఇండియా ఈ మేరకు కీలక ప్రకటన చేసింది.
కెప్టెన్ సుమిత్ సభర్వాల్ 8,200 గంటల అనుభవం ఉన్న పైలట్. రన్ వే 23 నుండి బయలు దేరింది. ఇది ఏటీసీకి మేడే కాల్ అని వచ్చింది. ఆ తర్వాత సంబంధాలు తెగి పోయాయి. రన్ వే నుండి బయలు దేరిన వెంటనే నేలపై పడి పోయింది. ప్రమాద స్థలం నుండి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎయిర్ ఇండియా ఎక్స్ వేదికగా తెలిపింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.