అమరావతి – ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 21న యోగా దినోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్టణానికి చేరుకుంటారు. ఆయన 20వ తేదీన భువనేశ్వర్ కు వెళతారు. అక్కడ కార్యక్రమాలలో పాల్గొని నేరుగా రాత్రికి వైజాగ్ కు చేరుకుంటారు. నావికా దళం గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా డేకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్బంగా విశాఖలో నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం యోగా సదస్సులో ప్రసంగిస్తారు. ఈ ర్యాలీని 5 లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించింది కూటమి సర్కార్. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పలుమార్లు సమీక్ష చేపట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని లక్ష ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నతాధికారులు, మంత్రులు కూడా ఉన్నారు. యోగా డే సందర్బంగా మొత్తం పాల్గొనేందుకు 2 కోట్లకు పైగా జనం రిజిస్ట్రేషన్ చేయించు కోవడం విశేషం. ప్రపంచంలోనే ఈ యోగా డే రికార్డ్ సృష్టించాలని ఆదేశించారు సీఎం.
అంతే కాకుండా కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎవరైతే మూడు రోజుల పాటు యోగా చేస్తారో వారికి ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ బాబు. ఇప్పటికే 1,05,266 ప్రదేశాలను గుర్తించడం జరిగిందన్నారు.