అమరావతి – ఏపీకి అప్పులు ఇవ్వడం కాదని ముందు రాజధాని కావాలని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి. ఏ ముఖం పెట్టుకుని విశాఖకు వచ్చారంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు విభజన హామీలు నెరవేర్చ లేదన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత కేంద్రానికి దక్కుతుందన్నారు. ఇంత మోసం చేస్తున్నా ఎందుకని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేయడం తప్పితే చేసింది ఏముందంటూ నిలదీశారు.
శనివారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ మాయ మాటలు చెప్పడంలో రాటు తేలాడని ఎద్దేవా చేశారు. ఆయనవన్నీ ఉబుసుపోక కబుర్లు తప్పా చేసింది ఏమీ లేదన్నారు. ఏపీకి రాష్ట్ర ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్. రాష్ట్ర రాజధానిని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ సీఎం , వైసీపీ బాస్, తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారుణమైన భాషను ఉపయోగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఎవరిని నరుకుతారో ప్రజలకు చెబితే బావుండేదన్నారు. అసలు మనం ఈ దేశంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఇలాగైతే ప్రజలు ఒకరిపై మరొకరు దాడులకు దిగే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావిస్తే జగన్ కు బావుంటుందంటూ సూచించారు ఏపీపీసీసీ చీఫ్.