హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను హైదరాబాద్ లో హనుమకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించాడని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి తనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు పోలీసులు. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని రూ. 50 లక్షలు ఇవ్వాలని బెదిరించాడన్నారు. బాధితుడి భార్య ఉమాదేవి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఇదిలా ఉండగా తనపై కావాలని సర్కార్ కుట్ర పూరితంగా కేసు నమోదు చేయించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్బంగా తనకు మధ్యంతర బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. అడ్డమైన వారికి బెయిల్ ఇవ్వడం కుదరదంటూ పేర్కొంది. ఈ సందర్బంగా బెయిల్ రాక పోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. తాను ప్రజా ప్రతినిధినని, ఎమ్మెల్యే అయినా చూడకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ నిలదీసే ప్రయత్నం చేశారు.
తాను అక్రమ కేసులకు భయపడేటోన్ని కాదని అన్నారు కౌశిక్ రెడ్డి. ఆయనను హనుమకొండ పోలీసులు హైదరాబాద్ నుంచి హనుమకొండకు తరలించారు. కాసేపట్లో తనను కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. అయితే ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని ఇవేవీ పోలీసులు పట్టించు కోలేదన్నారు ఎమ్మెల్యే.