హైదరాబాద్ – బనకచర్ల ప్రాజెక్టు వివాదంపై తీవ్రంగా స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆనాడు జగన్ తో దోస్తీ చేసింది, రాయలసీమకు మద్దతు పలికింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎవరిని ఫూల్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆరెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా పోయాక ఇంకోలా మాట్లాడటం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటుగా మారిందన్నారు సీఎం.
వాళ్లు సెంటిమెంట్ తో మళ్లీ పార్టీని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారి ఆటలు సాగవన్నారు. రైతాంగాన్ని కష్టాల నుంచి బయట పడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. కెసీఆర్, హరీష్ సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా, సూచనలు చేసినా స్వీకరిస్తామన్నారు. కానీ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తామంటే ఊరుకోనన్నారు. కేవలం దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు చేస్తున్నారని వాపోయారు.
21-9-2016 న ఢిల్లీ శ్రమ శక్తి భవన్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారని చెప్పారు. ఆ సమావేశంలో 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కెసీఆర్ ప్రతిపాదన చేశారని అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలోనే పునాది పడిందన్నారు రేవంత్ రెడ్డి. ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావుకు పంపిస్తానని అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ఆనాడే కేసీఆర్ చెప్పారని, ఆ తర్వాత మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఇంటికి వెళ్లి చాపల కూర పులుసు తిన్నది జనం మరిచి పోయారని అనుకుంటే ఎలా అని ఎద్దేవా చేశారు.