ఆర్థిక సుస్థిర‌త కోసం ఫోక‌స్ పెట్టాలి – సీఎం

ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి – రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై నిర్దేశం చేశారు. గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలన్నారు. రుణ భారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలక అంశాలని చంద్రబాబు వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పని చేయాలని ఆదేశించారు.

ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ప్రామాణిక సమాచారాన్ని రూపొందించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రణాళిక శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కెబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడితో ఆగకుండా.. ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామన్నారు.

Comments (0)
Add Comment