అమరావతి – వేశ్యల రాజధాని అంటూ సాక్షిలో చర్చకు తెర లేపి చివరకు జైలు పాలైన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఒక రకంగా 70 ఏళ్లకు పైబడిన ఆయనకు ఇప్పుడు చట్టం అంటే ఏమిటో, ఒకే పార్టీకి వంత పాడితే ఎలా ఉంటుందో అనుభవ పూర్వకంగా తెలిసి వచ్చినట్టుంది. మీడియా అంటేనే ఎవరికి తోచింది వారు ప్రచారం చేసుకునే వేదికలుగా మారి పోయాయి. ఎక్కడో ఆంధ్రాలో ఏదో జరిగితే తెలంగాణలో ఎందుకు చర్చా వేదికలు పెడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది పక్కన పెడితే తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ తనకు బెయిల్ కావాలంటూ మనోడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
చివరకు కోర్టు తనకు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆదేశించింది. మంగళగిరి కోర్టు తనకు 14 రోజుల రిమాండ్ విధించింది. తనకు ప్రత్యేకంగా బెడ్ కావాలని కోరాడు. దీనికి జడ్జి ఒప్పుకోలేదు. అందరి నేరస్థుల లాగానే నువ్వు కూడా నిందితుడివేనంటూ పేర్కొన్నారు. ఇది పక్కన పెడితే తాజాగా ఇచ్చిన బెయిల్ పై స్పందించాడు సాక్షి పత్రిక, ఛానల్ ఓనర్ , వైసీపీ బాస్ , మాజీ సీఎం జగన్ రెడ్డి. ఈ బెయిల్ కూటమి సర్కార్ అరాచక పాలనకు చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ముదావహమని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని ఆరోపించారు.