హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. పాలనా పరంగా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం చెందాడని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలను ఆచరణకు నోచుకోని హామీలతో మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తనను ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇకనైనా ప్రజలందరూ ఏకం కాకముందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తాని కే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్ అయ్యాయని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో ఊదరగొట్టిన హామీల అమలును గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటడం లేదన్నారు.. ప్రజలను నమ్మించడం, నయవంచన చేయడంలో కాంగ్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందన్నారు హరీశ్ రావు.
.సీఎం రేవంత్ రెడ్డి అధి కారంలోకి వచ్చిన వంద రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో పెట్టాడని గుర్తు చేశారు.. కానీ ప్రస్తుతం గొర్రెల పంపిణీ దేవుడెరుగు, కట్టిన డీడీ పైసలు కూడా వాపస్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సీఎం చెప్పిన దొంగ మాటలు విని మోసపోయామని గ్రహించిన గొల్ల, కుర్మలు ఏకంగా గాంధీ భవన్ కు వచ్చారని, వారితో పాటు గొర్రెలు, మేకలను తీసుకు వచ్చారని అయినా సిగ్గు రావడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే వారితో పాటు మూగ జీవాలను అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.