ముంబై – భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. అందరి కళ్లు గంభీర్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంపిక అనేది సవాల్ గా మారింది. తాజాగా సీనియర్ క్రికెటర్, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తాను నాయకత్వ పదవితో పాటు టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలోనే మరో షాక్ ఇస్తూ స్టార్ క్రికెటర్ , రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సైతం తాను కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఈ సమయంలో కెప్టెన్సీ పదవి ఖాళీ అయ్యింది. దీనిపై బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దృష్టి సారించారు. ఈ మేరకు కీలక సమావేశం బీసీసీఐ కార్యాలయంలో జరగనుంది. ఈ కీలక భేటీకి హాజరు కానున్నాడు గౌతమ్ గంభీర్. ఇదిలా ఉండగా హెడ్ కోచ్ ముంబైలో ప్రముఖ దేవాలయమైన సిద్ది వినాయక గుడిని దర్శించుకున్నాడు. ఈ సందర్బంగా తను మీడియాతో ముక్తసరిగా మాట్లాడాడు.
భారత క్రికెట్ కు సంబంధించి మూడు ఫార్మాట్ ల జట్లకు వేర్వేరుగా కెప్టెన్లు, వైస్ కెప్టెన్లను ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీని వల్ల ఆయా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నాడు. తమ ప్రతిభను మరింత ప్రదర్శించేందుకు వీలు కలుగుతుందన్నాడు. దీంతో కెప్టెన్సీ ఎంపిక అనేది అనివార్యమని తేలి పోయింది. ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో పాండ్యా, బుమ్రా, గిల్, పంత్ , అయ్యర్ ఉన్నారు.