ఢిల్లీ – భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ పరేడ్ సందర్బంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. లక్షలాదిగా తరలి వచ్చారు ఈ సెలబ్రేషన్స్ చూసేందుకు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. వారంతా వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీనికంతటికీ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో పాటు రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
అంతే కాకుండా గురువారం ఈ ఘటనపై విచారణ చేపట్టింది కర్ణాటక రాష్ట్ర హైకోర్టు. ధర్మాసనం సంచలన కామెంట్స్ చేసింది. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందని పేర్కొంది. ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. పోయిన ప్రాణాలను తిరిగి తీసుకు రాగలరా అని ప్రశ్నించింది. ఇదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సెలబ్రేషన్స్ జరుపుకోవడం , ఘటన జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గౌతమ్ గంభీర్. ఆ పోయిన 11 ప్రాణాల గురించి ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించాడు.
ఆర్సీబీ విజయోత్సవాలు జరుపుకునే సమయం ఇది కాదన్నాడు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాల్సి ఉందన్నాడు. ప్రభుత్వ పరంగా లోపాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మొత్తం విచారణలో బయట పడుతుందని, ఈ సందర్బంగా ఆర్సీబీని , మేనేజ్ మెంట్ ను ఏకి పారేశాడు గౌతమ్ గంభీర్.