హైదరాబాద్ – మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్బంగా తన శిష్యుడు రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని, ప్రధానంగా ఈ ప్రాంతానికి చెందిన వనరులపై కన్నేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి తన గురువు కోసం మౌనంగా ఉన్నాడని మండిపడ్డారు.
పదే పదే ఢిల్లీలో జరిగిన నీటి పారుదలకు సంబంధించిన సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడారో పూర్తిగా మినిట్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా, నోటికి ఏది వస్తే అది ఆధారాలు లేకుండా మాట్లాడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు.
తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రాలో పని చేసి రిటైర్ అయిన మాజీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కు ఏం తెలుసని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సలహాదారు కాదని చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్యలో అంబికా దర్బార్ బత్తి అని ఎద్దేవా చేశారు. బనకచర్ల అనేది కర్నూలు జిల్లాలో ఉంటే ప్రకాశం జిల్లాలో ఉందని చెప్పడం తన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు హరీశ్ రావు.