హైదరాబాద్ – ఉత్తర తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు కురుస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని పేర్కొంది. కేరళ, గోవా, కర్నాటక, మహారాష్ట్ర, మిజోరాం..మణిపూర్, నాగాలాండ్లలో వర్షాలు కురస్తాయని స్పష్టం చేసింది. రెండు రోజుల్లో ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది. అయితే జూన్ 2 తర్వాత రుతు పవనాలు తగ్గనున్నాయని వెల్లడించింది.
మరో వైపు రుతు పవనాల కారణంగా దక్షిణ తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిపి వేశారు. భారీ వర్షాలతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకో వైపు కేరళలో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.