అహ్మదాబాద్ వేదికగా మంగళవారం ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుతో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు తలపడనుంది. నువ్వా నేనా తేల్చుకోనుంది. ఈ సీజన్ లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. ఈ సందర్బంగా ఆర్సీబీ స్కిప్పర్ రజత్ పాటిదార్ ఫైనల్ పోరాటం గురించి స్పందించాడు. మీడియాతో మాట్లాడుతూ తాము శాయ శక్తులా పోరాడుతామని స్పష్టం చేశాడు.
తమ ఫోకస్ అంతా కప్ మీదనే ఉందన్నాడు. గత కొన్నేళ్లుగా బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ లో గెలుపొంది గిఫ్ట్ గా ఇవ్వాలని ఉందన్నాడు. తను ఎన్నో కీలక మ్యాచ్ లలో ఆర్సీబీని ఒంటి చేత్తో గెలిపించాడని ప్రశంసలు కురిపించాడు. తన ఫామ్ కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఫైనల్ లో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ సూపర్ షో చేయడం ఖాయమన్నాడు.
అయితే ప్రత్యర్థి జట్టు పంజాబ్ ను తాము తక్కువ అంచనా వేయడం లేదన్నాడు. ఆ జట్టు ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో అత్యంత బలంగా ఉందన్నాడు. ప్రధానంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ లో ఉన్నాడని, తనను త్వరగా పెవిలియన్ పంపిస్తే తాము సగం మ్యాచ్ గెలిచినట్టేనని చెప్పాడు రజత్ పాటిదార్. మొత్తంగా అందరి కళ్లు విరాట్ కోహ్లీ పైనే ఉంటాయన్నాడు. తను వేలాది మందికి స్పూర్తి దాయకంగా నిలుస్తూ వస్తున్నాడని ప్రశంసించాడు.