ఇరాన్ – ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పోరు మరింత ఉధృతంగా మారింది. ప్రతీకార దాడులకు దిగుతున్నాయి ఇరు దేశాలు. సుప్రీం లీడర్ ఆయతొల్లాహ్ ఖమీనీ ప్రధాన సలహాదారు అలీ షంఖానీ ఇజ్రాయెల్ నిర్వహించిన లక్ష్య దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఒకే రోజులో ఇజ్రాయెల్, ఇరాన్లోని 20 మంది కీలక సైనికాధికారులు , అణ్వస్త్ర శాస్త్రవేత్తలను లేపేసింది. ఈ దాడులు ఇరాన్లోని నాటాంజ్, ఖొందాబ్, ఖొర్రమాబాద్ వంటి కీలక అణు కేంద్రాలు , సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఫలితంగా, ఇరాన్ సైనిక , అణు సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ ఈ దాడుల్లో ఇరాన్లోని ప్రముఖ అధికారులను, వారి అణ్వాయుధ సంపదను, వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, ఖచ్చితమైన దెబ్బలు కొట్టడంలో సక్సెస్ అయ్యింది. ఈ వ్యూహాత్మక దాడుల లక్ష్యం ఇరాన్ నాయకత్వంలో గందరగోళం, అస్థిరత సృష్టించడమే కాకుండా, ప్రజల్లో తిరుగుబాటు రేకెత్తించాలని బిగ్ ప్లాన్ చేసింది ఇజ్రాయెల్.
తాజాగా ఎడ తెరిపి లేకుండా జరుపుతున్న దాడుల్లో ఇరాన్ సైనిక నాయకత్వంలో శూన్యతను సృష్టించి, దాని దీర్ఘకాలిక వ్యూహాత్మక సామర్థ్యాలను బలహీన పరిచేలా చేశాయి. ఈ పరిణామాలు దీర్ఘకాలంలో ఇరాన్పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇరాన్ నాయకత్వం ఈ దెబ్బ నుంచి కోలుకోవడం సవాలుతో కూడుకున్న పని, అదే సమయంలో మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడిని లేపేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని ఖండించారు ట్రంప్.