టాలీవుడ్ లో కొత్త సంప్రదాయానికి తెర లేపారు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. తనకు యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి తెలంగాణ స్లాంగ్ తో అదుర్స్ అనిపిస్తుండడంతో వరుసగా సినిమాలలో ఛాన్స్ లు వస్తున్నాయి. తను నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన టిల్లు స్వ్కేర్ సూపర్ హిట్ అయ్యింది. వరుసగా హ్యాట్రిక్ కొడదామని అనుకున్న సిద్దు ఆశలపై నీళ్లు చల్లింది జాక్ మూవీ. ఇటీవలే విడుదలై బొక్క బోర్లా పడింది.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనికి దర్శకత్వం వహించాడు ప్రముఖ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. తనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్న సిద్దు ఉన్నట్టుండి సినిమా ఆశించిన మేర ఆడక పోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఇందులో వైష్ణవి తనకు జోడీగా నటించింది. తెచ్చి పెట్టుకున్న స్లాంగ్ తో కరాబ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కథను నడిపించడంలో , ఆకట్టుకునేలా తీయడంలో ఫెయిల్ అయ్యాడు భాస్కర్. బొమ్మరిల్లు మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు అఖిల్ అక్కినేని, పూజా హెగ్డేతో బ్యాచిలర్ తీశాడు.
అది పర్వాలేదని అనిపించింది. ఆ తర్వాత వచ్చిన జాక్ ఝలక్ ఇచ్చేలా చేసింది. దీంతో తనను, సిద్దును నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాత లబోదిబోమని అంటుండడంతో గత్యంతరం లేక తన బాధను చూడలేక నటుడు సిద్దూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జాక్ లో నటించినందుకు తనకు పారితోషకంగా ఇచ్చిన రూ. 4 కోట్లను తిరిగి నిర్మాతకే ఇచ్చాడు. దీంతో తను సంచలనంగా మారాడు. సినిమాలలో నటించే ఇతర నటులు కూడా సిద్దూను స్పూర్తిగా తీసుకుంటే మంచిదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.