తిరుపతి – తిరుమల లడ్డూ విషయం మరోసారి బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా స్పందించారు తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్. ఆరు నెలల క్రితం నెయ్యి కల్తీ విషయం సీఎం చంద్రబాబు బయట పెట్టారని అన్నారు. సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో సరఫరా చేసింది నెయ్యి కాదన్నారు. ఫామ్ ఆయిల్, కెమికల్, యానిమల్ ఫ్యాట్ కలిపిన నూనె ను తిరుపతికి ప్రసారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం కిరణ్ రాయల్ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ కల్తీ నెయ్యి సరఫరా కేసులో మాజీ టీటీడీ ఈవో ధర్మా రెడ్డిని ఎందుకు విచారించ లేదని ప్రశ్నించారు. ఆనాడు అన్ని విభాగాలకు తానే బాస్ గా వ్యవహరించారని ఆరోపించారు. ధర్మారెడ్డి గ్యాంగ్ హటావో టీటీడీ బచావో అనేది తమ నినాదం అన్నారు. ధర్మారెడ్డి అనుమతి లేనిదే అప్పట్లో చిన్న ఫైల్స్ కూడా కదల లేదన్నారు. ఇది ముమ్మాటికి హిందూ మతంపై దాడి చేసే యత్నం జరిగిందన్నారు. ఇలాంటి వారిని ఊరికే వదల కూడదని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు కిరణ్ రాయల్.
పుష్ మై కార్ట్ సంస్థపై తిరుపతి చర్యలు అభినందనీయం అన్నారు. తిరుపతి లడ్డూకు పేటెంట్…. ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. పర్చేజింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరించిన బోర్డు మెంబర్లను సైతం విచారించాలన్నారు. ధర్మారెడ్డిని విచారించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాస్తానని చెప్పారు.