ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను కలిగిన విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో లక్ష మంది సాక్షిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. కళ్లల్లో నీళ్లు కారుతుంటే 18 ఏళ్ల సుదీర్గ విరామం తర్వాత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ ను 6 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025 విజేతగా నిలిచింది. కప్ ను తను ముద్దాడాడు. అంతకంటే ముందు మైదానానికి నమస్కరించాడు. తన జీవితంలో ఇది మరిచి పోలేని సన్నివేశంగా పేర్కొన్నాడు విరాట్ కోహ్లీ.
వన్డే, టి20, టెస్టు ఫార్మాట్ లలో టన్నుల కొద్దీ పరుగుల వరద పారించడమే కాదు మైదానాలలో చిరుత పులిలా కదిలే కోహ్లీ ఇలా భావోద్వేగానికి లోను కావడంతో అందరూ ఆశ్చర్య పోయారు. తను క్రికెట్ ను ఎంతగా ప్రేమిస్తాడో దీనిని బట్టి చూస్తే అర్థమవుతుంది. తన కోసం ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ కు, డివిలియర్స్, క్రిస్ గేల్ తో పాటు భార్య అనుష్క శర్మను ఆలింగనం చేసుకున్నాడు. తట్టుకోలేక పోయాడు. తను భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక చతికలి పడ్డాడు.
ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగు పెట్టేలా చేసే ఈ క్రికెటర్ ఇలా ఏడ్వడం ఏమిటి అంటూ విస్తు పోయారు. కానీ రాయల్ ఛాలెంజర్స్ జట్టుతో తనకు ఉన్న అనుబంధం అలాంటిది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. నా ఆత్మ, హృదయం ఎల్లప్పటికీ ఆర్సీబీతోనే ఉంటాయని స్పష్టం చేశాడు. తాజాగా కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఫోటోలు, వీడియోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.