హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి కాదు వందసార్లు విచారణకు హాజరవుతామని చెప్పారు. ఎందుకంటే తమకు చట్టం మీద గౌరవం ఉందన్నారు. సోమవారం ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇది మూడోసారి విచారణకు పిలవటం అన్నారు. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తాం అన్నారు. మా మీద కేసులు బనాయించి, కమిషన్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్.
ప్రశ్నించకుండా ఉంటారనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకం మాత్రమేనని పేర్కొన్నారు. కేసీఆర్ , హరీష్ రావులను కాళేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారని, పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. తనను కూడా మళ్లీ పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు.
అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ తమకు జైళ్లు, కేసులు కొత్త కాదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చానని చెప్పారు .
ఫార్ములా-ఈ రేసులో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ చేశామన్నారు కేటీఆర్. మీరు ఇచ్చిన హామీలు నెరవేరేంత దాకా నిలదీస్తూనే ఉంటామన్నారు. ఒక్కసారి కాదు వందలసార్లు జైలుకు వెళతామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మీరు ఇచ్చిన 420 హామీలు, దొంగ ఆరు గ్యారెంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.