ముంబై – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో ఆరంభంలో తడబడి ఆ తర్వాత పుంజుకున్న ముంబై ఇండియన్స్ ఏకంగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. సూపర్ షోతో ఆకట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చింది. ఒకానొక దశలో వికెట్లు కోల్పోయి తక్కువ స్కోర్ కే పరిమితం అవుతుందనుకున్న తరుణంలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు సూర్య కుమార్ యాదవ్. తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతో 73 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. సమిష్టి ప్రదర్శనతో ముంబై విక్టరీ సాధించింది. ఢిల్లీపై 59 రన్స్ తేడాతో గెలుపొందింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టడి చేసినా ఆఖరి రెండు ఓవర్లలో 48 రన్స్ ఇచ్చుకున్నారు. అనంతరం 181 రన్స్ లక్ష్యంతో మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్ ఆశించిన మేర రాణించలేక పోయారు. ముంబై బౌలర్ల దెబ్బకు విల విల లాడారు. 18.2 ఓవర్లలో కేవలం 121 రన్స్ కే పరిమితమైంది. సమీర్ రిజ్వీ 35 బంతుల్లో 39 రన్స్ ఒక్కడే ఆ జట్టులో అత్యధిక పరుగులు చేశాడు. మిగతా వాళ్లు పెవిలియన్ బాట పట్టారు. ముంబై బౌలర్లలో శాంట్నర్ 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీస్తే బుమ్రా 12 రన్స్ ఇచ్చి మరో 3 వికెట్లు కూల్చాడు.