యోగా డే కోసం విశాఖ స‌ర్వాంగ సుంద‌రం

ప్ర‌ధాని రాక సంద‌ర్బంగా భారీగా ఏర్పాట్లు

విశాఖపట్నం జిల్లా – ఈనెల 21న నిర్వ‌హించ‌బోయే యోగా డే సంద‌ర్బంగా విశాఖ న‌గ‌రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దుతున్నామ‌ని అన్నారు మంత్రి డోలా బాల వీరాంజ‌నేయ స్వామి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త 25 రోజులుగా నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున‌ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. యోగా మన సాంప్రదాయానికి ప్రతిరూపం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆరోగ్య జీవనశైలిలో భాంగా ఉంద‌ని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ భావనలతో ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందన్నారు.

ఇప్పటివరకు 10 యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహించామ‌ని తెలిపారు. 11వ యోగా దినోత్సవాన్ని విశాఖ నగరంలో జరపడం రాష్ట్రానికి గ‌ర్వ కార‌ణ‌మ‌న్నారు మంత్రి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతార‌ని, సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నార‌ని మంత్రి వెల్ల‌డించారు.

విశాఖ బీచ్‌లో ఆలయం నుంచి బీచ్ వరకు యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. ఇక్కడ 3 లక్షల 26 వేల మందితో యోగా చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. అలాగే మొత్తం 5 లక్షల మంది పాల్గొననున్న యోగా కార్యక్రమం ద్వారా విశాఖ నగరంలో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందిని ఈ యోగా ప్రదర్శనలో భాగం చేయాలని లక్ష్యంగా నిర్దేశించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ కార్యక్రమంలో 25 వేల మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేస్తారని, వీటన్నింటికీ విశాఖ వేదికగా మారనుంద‌ని చెప్పారు డోలా బాల వీరాంజ‌నేయ స్వామి. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం రవాణా, భోజన వసతి, బస, మరుగుదొడ్ల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామ‌న్నారు.

Comments (0)
Add Comment