అమరావతి – గురువులను గౌరవించాలని వారి వల్లనే మనం అభివృద్దిలోకి వస్తామన్నారు మంత్రి నారా లోకేష్. తల్లులు చేసే త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. గురువులను దేవుడితో సమానంగా పూజించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు విద్యపై ఫోకస్ పెట్టాలని సూచించారు. లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లులో డాక్టర్ డీవీఆర్ స్కూల్ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు నారా లోకేష్. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గురువులను మనందరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. తాను కూడా ఈ స్థాయికి రావడానికి కారణం టీచర్లేనని పేర్కొన్నారు. విద్య మనల్ని గొప్ప వ్యక్తులుగా మారేందుకు దోహద పడుతుందన్నారు మంత్రి.
ఎదిగిన ప్రతి ఒక్కరి వెనుక తల్లిదండ్రులతో పాటు గురువుల పాత్ర కూడా ఉంటుందన్నారు. తల్లుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలని సూచించారు నారా లోకేష్. ఇల్లు దాటే ముందు తప్పనిసరిగా తల్లి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరాలని పిల్లలను కోరుతున్నానని అన్నారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్.