యోగాతో శారీరక, మానసిక దృఢత్వం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అనంత‌పురం జిల్లా – యోగాతో శారీరక, మానసిక దృఢత్వం సాధిస్తామని, తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుతామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ గంట పాటు యోగా చేస్తూ ఆరోగ్యక‌రమైన జీవనం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యోగాంధ్ర- 2025 మాసోత్సవాల్లో భాగంగా పెనుకొండలోని కియా పరిశ్రమ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రాచీన భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని అన్నారు. యోగాసనాలతో శారీరక, మానసిక దృఢత్వం సాధిస్తామన్నారు. ప్రస్తుత సమాజంలో తీవ్ర ఒత్తిళ్ల మధ్య జీవనం సాగిస్తున్నామని, ఇటువంటి సమయంలో మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా అవ‌స‌ర‌మ‌న్నారు.

ఎన్ని పనులున్నా 75 ఏళ్ల వయస్సులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ యోగా చేస్తారని మంత్రి సవిత వెల్లడించారు. యోగాతో ఆ వయస్సులోనూ యువకుడి మాదిరిగా రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేయగలుగుతున్నారని అన్నారు. ఆరోగ్యవంతంగా, ఏకాగ్రతతో, విజనరీతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. సీఎంను అందరూ రోల్ మోడల్ గా తీసుకుని, యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని సవిత పిలుపునిచ్చారు.

ఈనెల 21 న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు అన్ని చర్యలూ తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారన్నారు. విశాఖలోని ఆర్.కే బీచ్ వద్ద అయిదు లక్షల మందితో యోగా నిర్వహించబోతున్నామన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పీఎం మోదీ హాజ‌ర‌వుతార‌ని తెలిపారు.

Comments (0)
Add Comment