క్రికెట్ ఫార్మాట్ లో ఎవరు ఎప్పుడు హీరో అవుతారో చెప్పలేం. నిన్నటి దాకా రజత్ పాటిదార్ ఆటగాడిగా మాత్రమే తెలుసు. కానీ ఇవాళ 18 ఏళ్ల పాటు అందకుండా ఊరిస్తూ వచ్చిన ఐపీఎల్ 2025 కప్ ను ఎగురేసుకు పోవడంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టడంలో పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన కెప్టెన్సీతో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య ఎలాంటి భేషజాలకు పోకుండా చాలా కూల్ గా తన పని చేసుకుంటూ పోయాడు. చివరకు అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మైన రసవత్తర పోరులో ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ఝలక్ ఇచ్చాడు.
తన నాయకత్వ పనితీరుతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి ముందుగానే పసిగట్టాడు. క్వాలిఫయర్ -1లో ఇదే జట్టును ఓడించాడు. కానీ ఆ జట్టు దెబ్బతిన్న పులిలా క్వాలిఫయర్ -2లో వచ్చిన ఛాన్స్ ను వదులు కోలేదు. సదరు టీం స్కిప్పర్ శ్రేయాస్ అయ్యర్ మామూలోడు కాదు. తనకంటే వ్యూహాలు రచించడంలో, దానిని వర్కవుట్ చేయడంలో నేర్పరి. ఇద్దరు ఉద్దండుల మధ్య చివరకు రజత్ పాటిదారే గెలిచాడు.
ఒక రకంగా జట్టును గెలిపించాడని చెప్పక తప్పదు. కోట్లాది మంది కళ్లల్లో వత్తులు పెట్టుకుని చూసిన ఈ రసవత్తర పోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫుల్ ఫామ్ లో ఉన్న అయ్యర్ ను బోల్తా కొట్టించేలా చేశాడు పాటిదార్. షెఫర్డ్ ను ప్రయోగించాడు. ఇక కృనాల్ పాండ్యా, జోషల్ వుడ్ ..భువీలను ఉపయోగించుకున్న తీరు సూపర్. మొత్తంగా హ్యాట్సాఫ్ రజత్ పాటిదార్.